తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ కు దిగింది. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సీనియర్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయింది. కాంగ్రెస్ను వీడుతున్నట్టు చెప్పిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరింది. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేతవీరప్ప మొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిసి ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయిస్తున్న తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్కు అందజేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని వీరప్ప మొయిలీ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని, లోక్ పాల్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇకనైనా కేసీఆర్ అక్రమాలు ఆపాలని వీరప్ప మొయిలీ హెచ్చరించారు. తెలంగాణలో ప్రజాస్వామాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని, ఎన్నికలు జరిగిన మూడు రోజుల నుంచే పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని మరో సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీరు సరిగా లేదన్నారు. సీఎం కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.ఇందుకు సాక్ష్యం పార్టీ మారిన ఎమ్మెల్యేల లేఖలు ఒకేవిధంగా ఉన్నాయని, చీప్ మినిస్టర్ కార్యాలయం నుంచి వచ్చయన్నారు. కేసీఆర్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై ఉద్యమం ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.