కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సుప్రీం కోర్టు చోర్ అని చెప్పిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రాఫెల్ డీల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను విచారిస్తామంటూ గత వారం సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ చౌకిదార్ అని చెప్పుకుంటున్న ప్రధానిని చోర్ అని సుప్రీంకోర్టే చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు చెప్పని విషయాలను ప్రస్తావించడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు వివరణ ఇవ్వాలంటూ రాహుల్కు నోటీసులు జారీ చేసింది.