కేంద్రంలో యూపీఏ సర్కార్ ఏర్పాటైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేరతారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను తీవ్ర అయోమయానికి గురి చేస్తాయని టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. ఇక యూపీఏ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తుంటే ఇటు టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదన్న కేసీఆర్ మాటలనే జగ్గారెడ్డి నమ్ముతున్నారా? అని విజయశాంతి ప్రశ్నించారు. కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కష్టపడుతున్న తరుణంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు.
దీనిపై స్పందిన జగ్గారెడ్డి విజయశాంతి వ్యాఖ్యలపై కామెంట్ చేయనని జగ్గారెడ్డి అన్నారు. విజయశాంతికి పీసీసీ చీఫ్ పదవి కావాలేమోనని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కోసం ఫుల్టైం పనిచేస్తే విజయశాంతికి మంచి భవిష్యత్ ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ పదవి కావాలనుకునేవారు సొంత ఖర్చులతో పార్టీని నడపాలన్నారు. ఇటివల కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్ వైఫల్యం కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేవలం వారి సొంత ప్రయోజనాలకు మాత్రమే పార్టీని వీడుతున్నారని అన్నారు.