సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి భారీ ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంతపార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక ఊహించినట్టుగా గత రాత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం మధురలో ప్రియాంక చతుర్వేది రఫెల్ డీల్ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమె పట్ల కొందరు కాంగ్రెస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వారిపై ప్రియాంక కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారిని పార్టీ సస్పెండ్ చేసింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా జోక్యంతో వారిపై సస్పెండ్ ఎత్తివేసినట్లు ప్రకటించారు. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం శ్రమించే వారికి బదులు గాలి బ్యాచ్కు ప్రోత్సహం ఇస్తుందని.. గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.