తెలంగాణ రెండో శాసనసభాపతిగా పోచారం శ్రీనివాస్రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారైన తర్వాత స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారనే ఉత్కంఠ సాగుతున్న నేపథ్యంలో అధికారపార్టీ చివరకు పోచారం పేరును ఖరారు చేసింది. ఆయన ఇవాళ నామినేషన్ వేయనున్నారు. రేపు స్పీకర్ను ఎన్నుకోనున్నారు.
అయితే స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సీఎం కేసీఆర్ ముమ్మర ప్రయత్నం చేశారు. అందుకు కేసీఆర్ బుధవారం సాయంత్రం టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. అయితే, కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి లక్ష్మణ్, ఒవైసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటు ఉత్తమ్ మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
ఈ ఉదయం సమావేశం అయిన సీఎల్పీ స్పీకర్ ఎన్నికలో పోటీ చేయరాదని నిర్ణయించింది. దీంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు చెప్పొచ్చు. పోటీలో ఎవరూ లేకపోవడంతో అధికార పార్టీ ప్రకటించిన అభ్యర్థే శాసనసభాపతిగా కొనసాగుతారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఇవాళ నామినేషన్ వేస్తారు. రేపు ఆయన్ని సభాపతిగా ఎన్నుకుంటారు.