పాకిస్థాన్ తీరు మారడం లేదు. ప్రపంచ దేశాల ముందు శాంతి వచనాలు వల్లెవేస్తున్న దాయాది దేశం సరిహద్దుల్లో మాత్రం రెచ్చిపోతోంది. ఎనిమిది రోజు నుంచి జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్విస్తోంది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు ఆమె తొమ్మిది నెలల కూతురు, ఐదేళ్ల కొడుకు మృతి చెందడం విషాదాన్ని నిందింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో మన దేశం ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన తర్వాత సరిహద్దుల్లో దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వుతోంది. కొద్ది రోజులుగా నిరంతరాయంగా కాల్పులకు తెగబడుతోంది. జమ్ము కశ్మీర్ సరిహద్దు గ్రామాలపైనా, భారత ఆర్మీ పోస్టులపైనా ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుపుతోంది. ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్థమాన్ విడుదలతో ఇండో పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావిస్తున్న సమయంలో కూడా పొరుగు దేశం పాత పాటే పాడింది. అభినందను భారత్కు అప్పగిస్తూనే సరిహద్దుల్లో కాల్పుల మోత మోగించింది.
అభినందన్ను అప్పగించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడి ముగ్గురు పౌరులను బలి తీసుకుంది. పూంచ్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన సాల్హోత్రిపై పాక్ సైనికులు మోర్టార్లతో జరిపసిన దాడుల్లో ఓ మహిళతో పాటు ఆమె తొమ్మిది నెలల కూతురు, ఐదేళ్ల కొడుకు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పాక్ కాల్పుల ఘటనలో మృతుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
పాక్ జరిపిన కాల్పుల్లో 9 నెలల పాపతో పాటు ఆమె తల్లి, ఐదేళ్ళ సోదరుడు చనిపోవడం అందర్నీ కలచివేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని పాక్ జవాన్లు కాల్పులు పరపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్ సైనికులు 60 సార్లకుపైగా జమ్ము కశ్మీర్ సరిహద్దులపై కాల్పులు జరిపారు. పాక్ జరుతున్న కాల్పులకు సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ వణికిపోతున్నారు. ఇళ్ళపై మోర్టారు షెల్స్ వర్షంలా కురుస్తుండటంతో చిన్న పిల్లలను వెంట బెట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.