ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. డేటా చోరీ కేసు వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రైవేట్ కంపెనీలో ఏపీ డేటా ఉండడం, ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లడంపై సుధీర్ఘంగా చర్చించారు. లీగల్గా తీసుకోవాల్సిన అంశాలను అడ్వకేట్ జనరల్తో ప్రస్తావించారు చంద్రబాబు. ఇటు ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తమ సంస్థలోని నలుగురు ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ కనిపించడం లేదంటూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇదిలా ఉంటే ఏపీలో దొంగ ఓట్లపై ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామన్నారు లోకేశ్వర్ రెడ్డి. టీడీపీ దొంగ ఓటర్లను సృష్టిస్తోందని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా, టెక్నికల్ అంశాలు తెలిసిన వ్యక్తిగా తాను ఈ కేసు వేశానన్నారు. ఒక ప్రైవేట్ సంస్థకు ఏపీ ప్రజల వివరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు లోకేశ్వర్ రెడ్డి. ఏపీ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి, అసభ్యంగా మాట్లాడుతూ తనని బెదిరించారని అన్నారు. ఏపీ ఓటర్ల సమాచారం లీక్ అయ్యిందని ఫిర్యాదు చేస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని లోకేశ్వర్రెడ్డి ఆరోపించారు.