వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ వచ్చే ఎన్నికలు మోడీ, రాహుల్ మధ్య జరిగేవి కావన్నారు. రఫెల్, భోఫోర్స్ అంటూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి కేంద్రంలో నిర్ణయాత్మకపాత్ర పోషిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
కేంద్రంలో థర్డ్ఫ్రంట్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సూచిస్తే కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. 2006లో టీఆర్ఎస్కు కరీంనగర్ గడ్డ పునర్జన్మనిచ్చిందని తెలిపారు. కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యాకే కరీంనగర్కు రైల్వేలైన్ వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే, దేశ ప్రధాని ఎవరన్న విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎంపీలకు తోడుగా మరో 70 మంది ఎంపీలు తోడవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ దేశాన్ని ఉద్ధరిస్తారని అందరూ భ్రమపడ్డారు కానీ, దేశం ముందుకు పోదన్న విషయం అర్థమైందని అన్నారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ లిద్దరూ దొందూ దొందేనన్న విషయం ప్రజలకు బాగా తెలుసని వ్యంగ్యంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని, 'కేంద్రంలో బడితె ఉన్నోడిదే బర్రె అయింది'అని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తన అత్తగారి ఊరి దాకా రైలు వేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
లోక్సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ గద్దె మీద మనమే కీలకం కాబోతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున 11 మంది సభ్యులను గెలిపించి లోక్సభకు పంపించామన్నారు. నాటి ఎన్నికల్లో మోడీ అంటే ఓ భ్రమని దేశాన్ని ఉద్దరిస్తాడని బీజేపీకి 283 సీట్లను కట్టబెట్టారని చెప్పారు.