దేశంలో పుల్వామా తరహా దాడులకు అవకాశం...ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో హై అలర్ట్

Update: 2019-02-21 07:37 GMT

పుల్వామా ఆత్మాహుతి దాడి తరహా ఘటనలకు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్లాన్ చేసిందా..? దేశంలో మరిన్న ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందా అంటే అవునంటున్నాయి కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు. పుల్వామా దాడి తర్వాత ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ లేదంటే జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఎదో ఒకచోట భారత జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.

తాన్‌జీమ్ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఉగ్రవాద దాడులకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. జమ్ము కశ్మీర్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌లే లక్ష్యంగా దాడులు జరగనున్నట్లు గుర్తించారు. ఈసారి చౌకీబల్, తాంగ్‌ధర్ రూట్లలో దాడులు జరగే అవకాశం ఉన్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ రూట్లలో IED దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. ఉగ్ర దాడుల కోసం తాన్‌జీమ్ సంస్థ ఆకుపచ్చ రంగు స్కార్పియోను సిద్ధం చేసిందని, దాని ద్వారా ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూప్‌లోని కోడ్‌ను నిఘా వర్గాలు ఛేదించాయి. పుల్వామాలో 300 కిలోల ఆర్డీఎక్స్‌తో జరిగిన దాడి ఓ ఆటబొమ్మలాంటిదని, 500 కిలోల పేలుడుకు సిద్ధంగా ఉండండి అని ఆ సందేశంలో రాసి ఉండటం గమనార్హం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కూడా చెప్పడం విశేషం. కశ్మీరీలను లక్ష్యంగా చేసుకోవడం భద్రతా బలగాలు మానుకోవాలని ఆ ఉగ్రవాద గ్రూపులు హెచ్చరించాయి. కశ్మీర్ లోయలోని ఉగ్రవాదులు పాక్ తీవ్రవాద నాయకులతో ఫోన్ లో మంతనాలు జరిపిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో జమ్మూతోపాటు ఇతర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. 

Similar News