పోలింగ్ ముగిసి పది రోజులు కావస్తున్నా ఏపీలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. కంప్లైంట్లతో కాకపుట్టిస్తున్న నాయకులు తాజాగా సోషల్ మీడియాలో కూడా అక్షర యుద్ధం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా వైసీపీ, జనసేన మధ్య జరుగుతున్న సోషల్ వార్ రక్తికట్టిస్తోంది. ఎన్నికలు ముగిశాయో లేదో ఏపీలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తొలుత ఈవీఎంలపై పోరాటంతో మొదలైన వార్ ఈసీకి ఒకరిపై మరొకరు కంప్లైంట్లు చేసుకోవడం వరకు పోరు రసవత్తరంగా మారుతోంది. తాజాగా వైసీపీ, జనసేన మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ గేమ్ను మరింత రక్తి కట్టిస్తున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ వార్కు బీజం పడినట్లైంది. దీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అటు పవన్, ఇటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. 65 స్ధానాల్లో పోటీ చేసి 88 సీట్లు గెలుస్తామంటూ జోస్యం చెబుతున్నారంటూ పంచ్ డైలాగ్ వేశారు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా ? అంటూ ఎగతాళిగా ప్రశ్నించారు. ఇటు విజయసాయిరెడ్డి ట్వీట్కు లక్ష్మినారాయణ కూడా అదే స్ధాయిలో స్పందించారు. తమ లెక్కలు కచ్చితంగా ఉన్నాయని.. సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. సత్యం, న్యాయంపై ఆధారపడి తాము పనిచేస్తామంటూనే మీ తప్పుడు లెక్కల వల్లే ఎంతో మంది ఇరుక్కున్నారని ట్వీట్ చేశారు.
దీనికి విజయసాయిరెడ్డి కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో మీ నాయకుడు పవన్ కల్యాణ్ను అడిగి చెప్పాలని తాజాగా మరో ట్వీట్ చేశారు. ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైన ప్రశ్నకు ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారంటూ ట్వీట్టర్లో పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఒక్కటే అనే యాంగిల్లో విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అటు విజయసాయిరెడ్డి ఇటు లక్ష్మినారాయణల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఎవరి ట్వీట్కు ఎవరు ఎలా సమాధానం ఇస్తారోనని నెటీజన్లు, రెండు పార్టీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికల నాటి పరిస్ధితులు ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు.