ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో పాలనపై దృష్టిసారించారు వైఎస్ జగన్. అందులో భాగంగా కీలక అధికారులను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న జగన్ ఇవాళ సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే డీజీపీగా ఆర్పీ ఠాకూర్ స్థానంలో గౌతం సవాంగ్ను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తికాగా తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్గా తెలంగాణ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను నియమించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే స్టీఫెన్ను తనకు ఇవ్వాల్సిందిగా జగన్ కేసీఆర్ను కోరినట్టు తెలుస్తోంది. దీంతో స్టీఫెన్ జగన్ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ నెల 30న ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అధికారికంగా కీలక అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది.