హిమాచల్ ప్రదేశ్ లోని కల్పా ప్రాంతానికి చెందిన శ్యామ్ సరన్ నేగి ఓ శతాధిక వృద్ధుడు. ఆయన వయసు 103 సంవత్సరాలు. అయితే, అసలు విశేషం అదికాదు. 1951లో భారత్ లో ప్రథమంగా ఎన్నికలు జరగ్గా, ఆ ఎన్నికల్లో ఓటు వేసిన తొలి భారతీయుడు శ్యామ్ సరన్ నేగీనే. సరిగ్గా చెప్పాలంటే ఆయన భారతదేశపు తొలి ఓటరు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నేగీ ఇప్పుడు మరోసారి ఓటు వేసి తన బాధ్యత చాటు కున్నాడు. పోలింగ్ స్టేషన్కు వచ్చిన నేగిని అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతించారు. 103ఏళ్ల వయస్సులోనూ ఆయన స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
1952 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అయితే హిమాచల్ప్రదేశ్లో మంచు కారణంగా ఐదు నెలల ముందే అంటే 1951 అక్టోబర్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మండి పార్లమెంట్ నియోజకవర్గంలో నేగి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నేగి 1917 జులై 1న హిమాచల్లోని కల్పాలో జన్మించారు. ప్రస్తుతం ఆయనకు 103ఏళ్లు. అయినా సరే క్రమం తప్పకుండా అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.