కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ తన వాదనలు వినిపించింది. భారత్ వాదనలను తప్పుబట్టిన పాక్ పాకిస్తాన్లో జరిగిన అనేక బాంబు పేలుళ్ల వెనుక ఇండియా హస్తముందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా 2014లో జరిగిన ఉగ్ర దాడిలో భారత్ ప్రమేయముందని ఆరోపించింది. భారత్ నిజాలను దాస్తోందన్న పాకిస్తాన్ ఆత్మాహుతి దాడులతో బలూచిస్థాన్లో అల్లకల్లోలం సృష్టించేందుకు జాదవ్ ప్రయత్నించాడని వాదనలు వినిపించింది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, ఇదే సమయంలో కుల్ భూషణ్ జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారణకు రావడం ఇరుదేశాల మధ్య వాతావరణాన్ని మరింత హీటెక్కించింది. కుల్భూషణ్ జాదవ్ కేసుపై ఐసీజేలో నాలుగు రోజులపాటు సాగనున్న విచారణలో భారత్ మొదట తన వాదనలు వినిపించింది. జాదవ్కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను రద్దుచేసి, వెంటనే విడుదల చేయాలని అంతర్జాతయ న్యాయస్థానానికి భారత్ విజ్ఞప్తి చేసింది. జాదవ్తో బలవంతంగా నేరాన్ని అంగీకరింపజేసి, దాన్ని భారత్కు వ్యతిరేకంగా దుష్ప్రచారానికి వాడుకుంటోందని ఇండియా ఆరోపించింది.
భారత్ తరపున వాదనలు వినిపించిన మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. జాదవ్ను కలిసేందుకు దౌత్యపరంగా అనుమతినివ్వకపోవడం అంతర్జాతీయ తీర్మాన ఉల్లంఘనేనన్నారు. గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాలపై ఎలాంటి ఆధారాల్లేవన్న భారత్ జాదవ్కు మరణశిక్ష విధించే ముందు పాక్ సైనిక కోర్టు కనీస ప్రమాణాలను పాటించలేదన్నారు. జాదవ్ విషయంలో పాక్ చెబుతున్నవన్నీ కల్పిత కథలేనని వాదించారు.
అయితే, ఈరోజు ఐసీజేలో వాదనలు వినిపించిన పాకిస్తాన్ 2014లో జరిగిన పెషావర్ ఉగ్రదాడిలో భారత్ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కుల్భూషణ్ జాదవ్తో బలూచిస్థాన్లో దాడులు చేయించాలని భారత్ ప్రయత్నించిందని, ఈ విషయాన్ని జాదవ్ స్వయంగా ఒప్పుకున్నాడని తెలిపింది. జాదవ్ రా అధికారి అంటూ ఆరోపించిన పాకిస్తాన్ అజిత్ ధోవల్ మార్గనిర్దేశకత్వంలో ఈ పనులన్నీ చేశాడని, ఆత్మాహుతి దాడులతో పాక్లో అల్లకల్లోలం సృష్టించేందుకు జాదవ్ ప్రయత్నించాడని ఆరోపించింది. ఇదిలా ఉంటే, ఐసీజేలో పాక్ తరపు జడ్జి అస్వస్థతకు గురికావడంతో జాదవ్ కేసు విచారణను వాయిదా వేయాలని పాక్ కోరింది. అయితే వాయిదాకు ఐసీజే నిరాకరించడంతో అందుబాటులో ఉన్న న్యాయమూర్తులతోనే పాకిస్తాన్ తన వాదనలు వినిపించింది.