తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కనీ వినీ ఎరుగని రీతిలో నష్టాలను మిగిల్చాయి. అన్నదాతలను నిండా ముంచెత్తాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కడగళ్లను మిగిల్చాయి. చాలా జిల్లాల్లో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. ఉత్తరాంధ్రతో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్సాలు బీభత్సాన్ని సృష్టించాయి.
ముఖ్యంగా హైదరాబాద్ను అకాల వర్షాలు వీడట్లేదు. గత 4 రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం మాడు పగిలే ఎండకొడుతుండగా సాయంత్రానికి ఆకాశం మేఘావృతం అవుతుంది. తర్వాత రాత్రంతా వర్షం పడుతుంది. అర్ధరాత్రి కూడా వాన బీభత్సాన్ని సృష్టిస్తోంది. రహదారులన్నీ చెరువులను తపిస్తున్నాయి. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ట్రాఫిక్ రద్దీ మరోవైపు వాననీటిలో ప్రయాణిస్తూ నరకాన్ని చూస్తున్నారు.
ఇక రాజధాని శివార్లలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. వడగళ్లతో భారీగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా మిరప, టమాట, మిర్చీ పంట లు నీటిపాలయ్యాయి. అయితే విదర్భ నుంచి ఛత్తీస్ఘడ్, ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.