ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ చేతులెత్తేసింది. టీఆర్ఎస్ రాజకీయ స్వార్థానికి ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకుంటుందని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించింది. అధికార పార్టీ వికృత రాజకీయ చేష్టలు చేస్తుందని నిప్పులు చెరిగిన తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందంటూ దుయ్యబట్టింది. కేసీఆర్ రాచరిక పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్న టీకాంగ్ నేతలు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం వెనక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన కానీ ఓటమిపాలైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా ఎన్నికలు జరిగే సమయం నాటికి పార్టీలోంచి మరికొంత మంది జంప్ అయ్యే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కూడా పాల్గోటున్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి 19 సభ్యుల మద్దతు ఉండగా తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించడంతో ఇక కాంగ్రెస్ పార్టీ బలం 15కు పడిపోయింది. ఐతే అసలు అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 21 మంది సభ్యుల మద్దతు అవసరం.