రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ అంతా బాగా ఉందని ఆంచానా వేశాం. ప్రచారం హోరెత్తించాం. 16సీట్లలో ఒకటి అర తప్ప అన్నింట్లోనూ కారు గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. కాని ఫలితాలు వచ్చే సరికి ఊహించని దెబ్బ ఎందుకు తగిలింది. ఓటమి తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం సమీక్షించుకుంటున్న తీరింది. ఓటమిపాలైన నియోజకవర్గాలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టారు గులాబీ బాస్. ఎమ్మెల్యేల పనితీరుపై గుర్రుగా ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్కు ఊహించని షాక్ నిచ్చాయి. కారు..సారు, సర్కారు పదహారు అనే నినాదం విఫలమైంది., కరీంనగర్ , నిజమాబాద్ పార్లమెంట్ సీట్లలో వినోద్ కుమార్, కవిత ఓడిపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీ ఓటమి కారణాలపై కేసీఆర్ ఎంక్వయిరీ మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుస్నాబాద్, హుజూరా బాద్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా 4 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో అయిదు వేలకుపైగా లీడ్ టీఆర్ ఎస్ కు వచ్చింది. కరీంనగర్ అసెంబ్లీలో పరిధిలో టీఆర్ ఎస్ కంటే బీజేపీకి 52 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్బన్, భోదన్ నియోజకవర్గాల్లో మినహా మిగలిన 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ రెండో ప్లేస్ లో నిలిచింది.
సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ లీడ్ వచ్చింది. ముషీరాబాద్, సనత్ నగర్, అంబర్ పేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు భారీగా గండిపడింది. ఒక్క అంబర్ పేటలోనే టీఆర్ఎస్.. బీజేపీ కి మధ్య 45వేల 3 వందల 90 ఓట్ల తేడా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గం సనత్ నగర్ లో దాదాపు 15 వేల లీడ్ బీజేపీకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ ఎస్ ఘోర పరాజయం పాలైంది. నల్గొండ, భువనగిరి సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంత్రి జగదీశ్ రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేట లోనే టీఆర్ ఎస్ కు ఆధిక్యం వచ్చింది. ఇతర చోట్ల కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది.
పార్లమెంట్ ఫలితాలపై పలు జిల్లాల పార్టీల నాయకులతో ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై చర్చించారు. ఎమ్మెల్యేల మధ్య సహకారం లేకపోవడంవల్లే కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఓటమిపాలైన ఎంపీ స్థానాల పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించి వివరణ తీసుకోవాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు.