మోడీ, కేసీఆర్, జగన్ను రాజకీయంగా బంగాళాఖాతంలో కలిపేస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉగాది పర్వదినాన ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు గుంటూరు జిల్లా చీరాల, పొన్నూరు, చిలకలూరిపేటలో రోడ్షోలు నిర్వహించారు. రాష్ట్రంపై ముప్పేట దాడి చేస్తున్న ఆ ముగ్గురిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడు జగన్ ముగ్గురూ రాష్ట్రంపై పడ్డారని మూడు రకాలుగా దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని అడిగితే మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నీ అబద్దాలే చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని తనకేమైనా చెవిలో చెప్పాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ దివాళా తీస్తుందని అదే కేసీఆర్ భయం అని చంద్రబాబు అన్నారు. రాజకీయంగా మోడీ, కేసీఆర్, జగన్లను ముగ్గురినీ బంగాళాఖాతంలో కలిపేస్తా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురి వల్ల వచ్చే ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్న చంద్రబాబు వారి కుట్రలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.