డేటా చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏపీ వర్సెస్ తెలంగాణ. టీడీపీ వర్సెస్ వైసీపీగా హైఓల్టేజ్ పొలిటికల్ వార్ జరుగుతోంది. చంద్రబాబు టార్గెట్గా టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ మూకుమ్మడి దాడి చేస్తుంటే తెలుగుదేశం లీడర్లు దీటుగా కౌంటరిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డేటా చోరీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగే దొంగా దొంగా అంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆ కంపెనీలు ఎవరివి? ఆ కంపెనీలతో చంద్రబాబుకి, లోకేష్కి ఉన్న సంబంధాలేంటో చెప్పాలన్నారు.
ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ కేటీఆర్ ఏ నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకంటూ ప్రశ్నించారు. జగన్, కేటీఆర్కి ఏపీ మంత్రి దేవినేని కౌంటరిచ్చారు. తెలంగాణలో 28లక్షల ఓట్లను తొలగించి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందన్న దేవినేని అదే తరహా కుట్రలను జగన్ కోసం ఏపీలోనూ ప్రయోగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి ఓటేయనివాళ్లను గుర్తించి తొలగించడానికే తెలుగుదేశం ప్రభుత్వం డేటా దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.
డేటా చోరీని తీవ్రంగా పరిగణించాలన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ కేసును కేంద్రానికి అప్పగిస్తేనే నిజాలు బయటికొస్తాయని అన్నారు. ఇదిలాఉంటే, డేటా చోరీ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్గా తీసుకోవడంతో న్యాయ పోరాటం చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానించడం సంచలనంగా మారింది.