అయోధ్య కేసుకి సంబంధించి కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాస్పద రామజన్మభూమి-మసీదు దగ్గర్లో వివాదంలో లేని 67 ఎకరాల స్థలాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలని ఇవ్వాలని సుప్రీంని కేంద్రం కోరింది.
రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం వివాదాస్పద భూమితో పాటుగా చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీంతో వివాదంలో లేని భూమిని దాని యజమాని అయిన రామజన్మభూమి నయాస్ లేదా రామాలయానికి సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం తన పిటిషన్ లో తెలిపింది.
వివాద రహిత భూమిని రామ జన్మభూమి న్యాస్కు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న చర్యను తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. వివాద రహత స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్కు ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నామని ఆదిత్యనాథ్ గుర్తుచేశారు.
కేంద్ర వేసిన పిటిషన్ పై సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజి మెహబూబ్ అహ్మద్ మండిపడ్డారు. ఆ భూమికి నిజమైన హక్కుదారులు హిందువులు కాదని ఆయన అన్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తే దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు.
అయోధ్యలో వివాదాస్పద భూమిని మూడు పార్టీలు సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖారా, రామ్ అల్లా సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.