సార్వత్రిక సమరంలో భాగంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఆరు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో జరుగునున్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. తొలి ఐదు దశల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపధ్యంలో పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ఎన్నికలు జరిగే పురులియా, బంకురా జిల్లాల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆరో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో హోరాహోరిగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో బ్రేక్ పడనుంది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 59 నియోజకవర్గాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. బీహార్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8 స్ధానాల చొప్పున పోలింగ్ జరగనుంది. తొలి ఐదు విడతల్లో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వీటితో పాటు ఉత్తర ప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాల్లో, హర్యానాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని 7 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జార్ఖండ్లోని నాలుగు స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 59 నియోజకవర్గాల పరిధిలో ఒక వెయ్యి 55 మంది అభ్యర్ధులు తమ తలరాతను పరీక్షించుకుంటున్నారు .
ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో అధిక శాతం అధికార బీజేపీ అభ్యర్ధులు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్ధానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మధ్య ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్లలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల ఎన్నికల్లో 21 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 424 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఆరో విడత ఎన్నికలు పూర్తయితే హర్యానా, ఢిల్లీలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.