ఏపీలో తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రపంచమంతా ప్రధాని మోడీ వైపే చూస్తోందన్నారు. తీవ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసిన ఘనత మోడీ దేనని, ఒకే ఒక్క దాడితో పెద్దసంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టారన్నారు. దౌత్యపరంగా భారత్ ఎన్నో విజయాలు సాధించిందని, అభినందన్ను విడిచిపెట్టేలా మోడీ పాక్ మెడలు వంచారని ఆయన అన్నారు. మమతాబెనర్జీ చేసిన తప్పుడు వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించారని, భారత్లోనూ పాకిస్తాన్కు హీరోలు ఉన్నారని జీవీఎల్ చెప్పారు. యూటర్న్లు తీసుకోవడంలో చంద్రబాబు అసాధ్యుడని, చంద్రబాబు వ్యాఖ్యలను పాకిస్తాన్ బాగా వాడుకుంటోందన్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల్లో రాజకీయాలు సరికాదన్నారు. అలాగే చంద్రబాబు-పవన్ మధ్య ఒప్పందం కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. పీకే అంటే మనం పవన్కల్యాణ్ అనుకుంటున్నాం కానీ అంతర్జాతీయ స్థాయిలో పీకే అంటే పాకిస్తాన్ అన్నారు. బీజేపీని దెబ్బతీయాలని చంద్రబాబు-పవన్ కుట్ర పన్నారని జీవీఎల్ ఆరోపించారు.