తిరుమలలో మరోసారి కిడ్నాప్ కలకలం
తిరుమలలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన బాలుడ్ని దుండగులు ఎత్తుకెళ్లారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు తమ కుమారుడితో కలిసి మాధవ నిలయంలో నిద్రిస్తుండగా బాలుడిని కిడ్నాప్ చేశారు.
తిరుమలలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన బాలుడ్ని దుండగులు ఎత్తుకెళ్లారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు తమ కుమారుడితో కలిసి మాధవ నిలయంలో నిద్రిస్తుండగా బాలుడిని కిడ్నాప్ చేశారు. తమ కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెదికిన తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. మహారాష్ట్ర లాతూరుకు చెందిన ప్రశాంత్ దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడితో కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వసతి గృహం దొరక్కపోవడంతో బస్టాండ్ దగ్గర్లోని మాధవ నిలయంలో బస చేశారు. అర్ధరాత్రి కుమారుడు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
పిల్లాడిని ఎత్తుకెళ్తోన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ను జల్లెడపడుతున్నారు. కిడ్నాప్ ఉదంతంతో టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏడాది క్రితం జరిగిన రెండు కిడ్నాప్ ఘటనలు మరువకముందే మరోసారి బాలుడి కిడ్నాప్ జరగడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులతోపాటు టీటీడీ అధికారులు కూడా బాలుడి ఆచూకీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.