బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల బరిలోకి దిగారు. పార్టీ కురువృద్ధుడు అద్వాని నియోజకవర్గం గాంధీ నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన కేంద్రమంత్రులు, అగ్ర నేతలు, స్ధానికులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆయన భార్య, కుమారుడితో కలిసి నామినేషన్ వేశారు. అంతకు ముందు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా నామినేషన్ కార్యక్రమానికి అగ్రనేతలంతా తరలివచ్చినా అద్వాని మాత్రం హాజరుకాలేదు. ఈ సందర్భంగా నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దేశ రక్షణ, ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాలు, అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రధాన మంత్రిని మరోసారి గెలిపించాలంటూ ఆయన ఓటర్లను కోరారు.