ప్రేమ వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించాల్సిందిగా పంజాబ్- హర్యానా ఉమ్మడి హైకోర్టు పంజాబ్ పోలీసులను ఆదేశించింది. వారి ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వివరాలు...67 ఏళ్ల షంషేర్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల 24 ఏళ్ల నవప్రీత్ కౌర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. జనవరిలో చండీగఢ్లోని గురుద్వారాలో వీరి వివాహం జరిగింది. ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు వివిధ వర్గాల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో షంషేర్, నవ్ప్రీత్లు తమకు రక్షణ కల్పించాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లే కనుక వారి పెళ్లిపట్ల ఎలాంటి అభ్యంతరం తెలుపని కోర్టు వారికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుపై షంషేర్-నవప్రీత్ దంపతులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వారి న్యాయవాది మాత్రం వివాహం చట్టబద్ధమైందే అని చెప్పారు. ఇద్దరికీ సజీవులైన జీవిత బాగస్వాములు లేరు కనుక ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.