ఏడో దశపోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈదశలో 59 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో 10కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చివరి దశలో 918మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఆదివారం జరిగే చివరి దశతో పూర్తి కానుంది. ఇప్పటి వరకు ఆరు దశల్లో 483 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. భారీ ఎత్తున నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రక్రియ చివరిదైన ఏడోదశకు చేరుకుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం తుదిదశ పోలింగ్ జరుగనుంది.
ఉత్తరప్రదేశ్లోని 13సీట్లకు 167మంది, పంజాబ్లో 13 స్థానాల్లో 278మంది, పశ్చిమ బెంగాల్లోని 9 ఎంపీస్థానాల్లో 111మంది, బిహార్లో 8 సీట్లలో 157 మంది, మధ్యప్రదేశ్లో 8 స్థానాల్లో 82మంది, హిమాచల్ ప్రదేశ్లోని 4సీట్లలో 45మంది, ఝార్ఖండ్లోని 3 సీట్ల కోసం 42మంది, చండీగఢ్లోని ఒక స్థానానికి 36 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏడోదశ బరిలో ఉన్న ప్రముఖుల్లో ప్రధాని మోడీ కూడా ఉన్నారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి ఏడో దశలో పోలింగ్ జరగనుంది. ఏడో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.