హైదరాబాద్ః వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి లండన్ పయనమయ్యారు. తన కూతురు వర్ష రెడ్డిని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేర్చేందుకు ఆయన లండన్ వెళుతున్నారు. ప్రస్తుతం వర్ష రెడ్డి అత్యధిక పాస్ పర్సంటేజ్తో కేంద్రీయ సిలబస్లో ఇంటర్ పూర్తి చేసింది. 99శాతం మార్కులను సాధిస్తే కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు దొరకదు. అలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో జగన్ కూతురు వర్ష రెడ్డి అత్యధిక మార్కులు తెచ్చుకుని సీటు సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 11 ఉదయం కూతురితో కలిసి లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటించనుండటంతో.. పర్యటనను మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే, జగన్ సెప్టెంబర్ 11 నుంచి 18వ తేదీ లోపు విదేశాల్లో పర్యటించ వచ్చని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన లండన్ నుంచి రాగానే.. అక్టోబర్లో తలపెట్టిన పాదయాత్రకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నంద్యాల, కాకినాడ ఫలితాలు ప్రతికూలంగా రావడంతో నిరుత్సాహంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో వైఎస్ జగన్ పాదయాత్ర నూతనుత్తేజాన్ని నింపడం ఖాయమని, 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు తథ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు.