టెక్ కంపెనీలు భారతీయులను నియమించొద్దు: గూగుల్, మైక్రోసాఫ్ట్కి ట్రంప్ హెచ్చరిక
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ AI సమిట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు భారతీయులకంటే అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని హితవు పలికారు.
Trump Warns Google and Microsoft: Don’t Hire Indians, Focus on American Jobs
భారతీయులను కాకుండా అమెరికన్లను మాత్రమే నియమించుకోవాలని టెక్ కంపెనీలకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సమిట్ (AI Summit) సందర్భంగా ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"అమెరికాలోని పెద్ద టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు ఏర్పాటు చేస్తూ, భారతీయ ఉద్యోగులను నియమిస్తూ, ఐర్లాండ్ ద్వారా తక్కువ ట్యాక్స్ చెల్లిస్తూ అమెరికన్ ప్రజలను విస్మరిస్తున్నాయి," అని ట్రంప్ విమర్శించారు.
"ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యతను ఈ సంస్థలు మరిచిపోతున్నాయి. కానీ నా పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి," అని హెచ్చరించారు.
టెక్ కంపెనీలు దేశభక్తి చూపిస్తూ అమెరికా కోసం పనిచేయాలని పిలుపునిచ్చిన ట్రంప్, "సిలికాన్ వ్యాలీకి దేశభక్తి కావాలి. AI రంగంలో అమెరికా ముందుండాలంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేశం ముందు, మీ లాభాలు తర్వాత," అని స్పష్టం చేశారు.
ఈ AI సమిట్లో ట్రంప్ మూడు కీలక ఆదేశాలపై సంతకం చేశారు:
- కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి ఆటంకాలను తొలగించాలి.
- అభివృద్ధిని వేగవంతం చేయాలి.
- ప్రభుత్వ నిధులు పొందుతున్న ఏఐ టూల్స్ రాజకీయపరంగా తటస్థంగా ఉండేలా చూడాలి.
టెక్ కంపెనీలు గ్లోబలైజేషన్ను అడ్డంగా పెట్టుకుని అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇది అమెరికన్ యువతకు నష్టం అని, ఇకపై అమెరికా ప్రథమంగా ఉండే విధానాన్నే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.