ఒక పక్క కరోనా కలకలం ఇంకా అలానే కొనసాగుతోంది. బ్రిటన్ ఇప్పటికే కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడి పిల్లలలో సరికొత్త వ్యాధి ప్రబలుతోంది. ఇది మరింత కలకలం సృష్టిస్తోంది.
ప్రాణాంతకమైన వ్యాధి లక్షణాలతో పలువురు చిన్నారులు గత పదిహేను రోజులుగా బ్రిటన్ లో ఆసుపత్రుల పాలవుతున్నారు. గుండెల్లో వాపు, కడుపు నొప్పిలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో చామందిని ఐసీయూ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇది కరోనా వైరస్ సంబంధిత వ్యాధి అని మొదట అనుకున్నారు. కానీ, తరువాత కరోనాతో సంబంధం లేని కొత్తవ్యాధిగా వైద్యులు గుర్తించారు. బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్హెచ్ఎస్) ఈ విషయం పై హెచ్చరిక జారీసేసింది. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఆస్తుపత్రుల్లో చేర్పించాలని ఆదేశించింది.
ఎన్హెచ్ఎస్ పేర్కొంటున్న ప్రకారం బ్రిటన్లోని వివిధ ప్రాంతాల్లో మూడు వారాలుగా పలువురు చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో ఐసీయూల పాలవుతున్నారు. ఎంతమంది ఈ వ్యాధి లక్షణాలతో బాధ పడుతున్నారు? ఎంతమంది చనిపోయారనే విషయాలను ప్రకటించలేదు కానీ, ఈ లక్షణాలు ప్రాణాంతకమైన 'టాక్సిక్ షాక్ సిండ్రోమ్'ను పోలి వున్నట్టు ఎన్హెచ్ఎస్ చెబుతోంది. పాక్షికంగా రక్తనాళాల్లో వాపు కనిపించే కవాసకీ వ్యాధి లక్షణాలూ కనిపిస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా లండన్కు చెందిన పిల్లల్లో ఈ అనారోగ్యాన్ని గుర్తించినట్లు చెప్పింది. శ్వాస తీసుకోవడం అసాధ్యంగా మారినప్పుడు అందించే 'ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)' చికిత్సను ఓ చిన్నారికి ఇవ్వాల్సి వచ్చిందని వెల్లడించింది. తాజా అనారోగ్యం 'సార్స్-కొవ్-2 సంబంధిత ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్' లేదా మరోటి అయ్యుండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.