ఇరాన్-అమెరికా మధ్య యుద్ధమేఘాలు
-అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు -మిలటరీ బేస్ క్యాంప్పై రాకెట్లతో విరుచుకుపడ్డ ఇరాన్
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికాపై ఇరాన్ ప్రతీకారదాడులు చేపట్టింది. ఇరాక్లోని రెండు అమెరికా బేస్ క్యాంప్లపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్లోని అమెరికా ఎయిర్బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఇరాక్లోని ఆల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై డజనుకుపైగా క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది.
అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలు అల్ అసాద్, ఇర్బిల్పై దాడి జరిగినట్లు గుర్తించారు. భారీ నష్టం జరిగినట్లు పెంటగాన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. అమెరికా లక్ష్యాలను ప్రపంచంలో ఎక్కడైనా దెబ్బతీస్తామని ఇరాన్ అధినేత సైనిక సలహాదారు మేజర్ జనరల్ హొసేన్ దేఘాన్ సులేమానీ అంత్యక్రియల సమయంలో హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పరిణామాలు యుద్ధాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. గల్ఫ్, ఇరాన్, ఇరాక్లపై విమానాల రాకపోకలను నిషేధించారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.