జమ్మూకశ్మీర్ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్ పై జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాది తనను తాను పేల్చుకొని 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయిన బాలకోట్లోని జైషే ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు దాకా మరణించారు. అయితే ఇంతమందిని చంపినా భారత సైనికుల గుండెమంట చల్లారలేదు.
ఉగ్రవాదులను ఎక్కడ దొరికితే అక్కడ ఏరిపారేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన పాక్ ప్రభుత్వం భారత్ పై ఆరోపణలదాడికి దిగుతోంది. ఈ నెల 16-20 తేదీల మధ్య మా దేశంపై దాడి చేసేందుకు భారత్ పథకం పన్నుతోందని, ఈ విషయమై తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముల్తాన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ మాపై దాడికి దిగబోతోందని అన్నారు. దౌత్యపరంగా ఇస్లామాబాద్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ ఈ దాడికి పూనుకుంటోందని ఆరోపణలు చేశారు.