దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. ఎగసిన రూపాయి విలువ!
దూకుడు మీద ఉన్న స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 26) దూసుకుపోయింది.
దూకుడు మీద ఉన్న స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 26) దూసుకుపోయింది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మోదీ సర్కార్ 1.70 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో మార్కెట్లు పరుగులు తీశాయి. బెంచ్మార్క్ సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1564 పాయింట్ల మేర పరుగులు తీసింది. 30,100 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ కూడా 8749 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు సెన్సెక్స్ 1411 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద, నిఫ్టీ 324 పాయింట్ల లాభంతో 8,641 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
♦ నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటొకార్ప్ షేర్లు లాభపడ్డాయి. నిన్న వెనుక బడ్డ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు ఏకంగా 46 శాతం పరుగులు పెట్టడం విశేషం.
♦ ఇక గెయిల్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. గెయిల్ 3 శాతం పడిపోయింది.
♦ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 8 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ రియల్టీ 7 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5 శాతం, నిఫ్టీ బ్యాంక్ 6 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 5 శాతం ర్యాలీ చేశాయి.
♦ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి భారీగా పెరిగింది. ఏకంగా 86 పైసలు లాభంతో 75.23 వద్దకు చేరింది.
♦ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 2.03 శాతం తగ్గుదలతో 29.38 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 2.12 శాతం క్షీణతతో 23.97 డాలర్లకు తగ్గింది.