కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఆరుగురు రాజీనామా చేశారు. మునిసిపాలిటీ పాలకవర్గంలో నెలకొన్న విభేదాల కారణంగా ఆ ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కాగా, ఈ మునిసిపాలిటీ పరిధిలో మొత్తం వార్డుల సంఖ్య 30. ఇందులో 22 స్థానాల్లో వైసీపీ, టీడీపీ 8 స్థానాలను దక్కించుకుంది. అయితే, మునిసిపాలిటి చైర్ పర్సన్ పదవి కోసం వైసీపీ నాయకురాళ్లు బసవా రేవతి, రామిశెట్టి త్రివేణి పోటీపడి రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో రేవతి, త్రివేణి ఒక్కొక్కరు రెండున్నరేళ్ల చొప్పున ఆ పదవిలో ఉండేలా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు తొలుత రేవత ఆ పదవి బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు ముగిసినప్పటికీ రేవతి ఆ పదవి నుంచి తప్పుకోననడంతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన త్రివేణి వర్గానికి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
మొదట కుదిరిన ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత మునిసిపల్ చైర్మన్ను మార్చాలని పట్టుబట్టిన కౌన్సిలర్లు అది నెరవేరకపోవడంతో అనారోగ్యంతో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నామంటూ రాజీనామాల బాటపట్టారు. తొలుత 27వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి త్రివేణిదుర్గ అనారోగ్యంతో రాజీనామా ప్రకటించారు. ఈనెల 26వ తేదీన 26వ వార్డు కౌన్సిలర్ పులపాక గంగాభవానీ, 29వ వార్డు కౌన్సిలర్ మేకల రమాదేవి కూడా అనారోగ్యంతో సక్రమంగా ప్రజా సమస్యల పరిష్కారంలో పాలుపంచుకోలేక పోతున్నందున రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్ మల్లికార్జున్రావుకు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఆనారోగ్యం వైరస్ గురువారానికి మరో ముగ్గురికి సోకింది. వారిలో 22వ వార్డు కౌన్సిలర్ యిరవ విజయలక్ష్మి, 28వ వార్డు కౌన్సిలర్ మనూరి పద్మావతి, 15వ వార్డు కౌన్సిలర్ శీలం రామయ్యరావు ఆనారోగ్య కారాణాల వల్ల రాజీనామా చేస్తున్న పత్రాలను సమర్పించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ఇద్దరు మహిళా కౌన్సిలర్స్ అనారోగ్యంతో రాజీనామా చేశామని తెలిపారు. శీలం రామయ్యారావు రాజీనామా పత్రంలో అనారోగ్య కారణమని రాసినా, వాస్తవానికి ఛైర్మన్ పదవి బదలాయింపులో ఒప్పందం అమలు జరగనందుకే రాజీనామా చేశామని స్పష్టం చేశారు.