తాను ప్రేమించిన ప్రొఫెసర్ ను వివాహం చేసుకోవడానికి ఓ యువతి తనను కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి ప్రయత్నించారని తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది. ఈ సమాచారం తప్పని తెలవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకొన్నారు. మరోవైపు తాను ప్రేమించిన అధ్యాపకుడిని వివాహం చేసుకొన్న విషయాన్ని ఆ యువతి వాట్సాప్ మేసేజ్ల ద్వారా స్నేహితులకు సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు.అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకొనేందుకే ఆ యువతి కట్టుకథ అల్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనను ఎవరో కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని వాట్సప్లో మెసేజ్లు పెట్టి అందరిని టెన్షన్కు గురి చేసింది.
పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కడప నగర శివార్లలో ఉన్న ఓ ప్రైవేటు విద్యాసంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అట్ల సాయికేశవ్ రెడ్డి అనే యువకుడిని, అదే కాలేజీలో చదువుకుంటున్న లక్ష్మీ ప్రసన్న ప్రేమించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఓ బురఖా ధరించి, కడప బస్టాండ్ నుంచి కర్నూలుకు బయలుదేరిన ఆమె, ఆళ్లగడ్డలో ప్రియుడిని కలిసింది. ఇద్దరూ కలసి నంద్యాల మీదుగా హైదరాబాద్ వెళ్లి, ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను, ఓ వీడియోను రికార్డు చేసి పోలీసులకు, స్నేహితులకు పంపించారు. తాను ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని, ఎవరి బలవంతం లేదని, తన గురించి వెతకవద్దని తెలిపింది. యువతి ప్రేమ వివాహం చేసుకున్నట్టు సమాచారం వచ్చిందని చెప్పిన కడప చిన్న చౌక్ సీఐ రామకృష్ణ, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిడ్నాప్, అత్యాచారం అంతా డ్రామాయేనని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.