ప్రయాణికుల పట్ల విమాన సంస్థలు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అరచేతిలో ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని గమ్యానికి చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా 120మందితో ప్రయాణిస్తున్నఇండిగో విమానం టైర్లు పేలి మంటలు వచ్చాయి.
బుధవారం రాత్రి తిరుపతి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఇండిగో విమానం ముందు టైరు పేలింది. గమనించిన పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. కాగా, ఈ విమానంలోనే వైసీపీ నగరి పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.
మంటలు రావడం, రెండు గంటలపాటు విమాన డోర్లు తెరుచుకోకపోవడంతో విమానంలోని 120మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికుల్ని ఆందోళన చెందవద్దని, విమానం దిగొద్దని సూచించింది.
అయితే మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత ప్రయాణికులను విమాన సిబ్బంది సురక్షితంగా కిందికి దించారు. ప్రమాద ఘటనతో తాను కూడా ఆందోళన చెందానని, విమాన సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని రోజా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు.