వివాహేతరసంబంధం నడుపుతుందనే కారణంగా కోడలిని దారుణంగా హత్య చేశారు అత్త మామలు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంసాగర్లో చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డిపేట గ్రామానికి చెందిన సుమలత(21)కు మూడేళ్ల క్రితం నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్తో వివాహం చేశారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. మల్లేష్ మానసిక వికలాంగుడు. దీంతో సుమలత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసి హెచ్చరించారు. అయినా కూడా వినని సుమలత అనైతిక సంబంధాన్ని కొనసాగించేది.ఈ క్రమంలో కుటుంబపరువు పోతుందేమోనని అత్త మామలు భయాందోళన చెందారు. దీంతో కోడలు సుమలత హత్యకు పథకం వేశారు. అందులో భాగంగా రాత్రివేళ నిద్రిస్తున్న సుమలతపై దాడిచేసి ఇనుపకర్రుతో వాతలు పెట్టారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమెను బయటపడుకోబెట్టి విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు కథ అల్లారు.మృతురాలు పరిస్థితి చూసిన బంధువులు ఆమెను హత్య చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.