భర్తను చంపి.. సెప్టిక్ ట్యాంక్లో పూడ్చి.. 13 ఏళ్ల తరువాత పోలీసులకు దొరికిపోయిన భార్య
భర్తను చంపిన ఓ మహిళ 13 ఏళ్ల తరువాత పోలీసులకు పట్టుబడ్డ ఘటన మహారాష్ట్రలోని పల్గర్ జిల్లా బోయిసర్లో చోటు చేసుకుంది. ఫరీదా భారతి అనే మహిళ అప్పట్లో తన భర్తను హత్యచేసి తమ ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్లో పడేసింది. ఆ తరువాత ఆమెపై ఆరోపణలు వచ్చినప్పటికీ కేసు ముందుకు సాగలేదు. అప్పటి నుంచి అదే ఇంట్లో ఆమె సెక్స్ రాకెట్ నడుపుతూ వస్తోంది.
తాజాగా ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఫరీదాతో పాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు మహిళలకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. అయితే, రెండోసారి ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు సెప్టిక్ ట్యాంకులో ఓ పుర్రెను చూసి విస్మయానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరీదా వ్యభిచారం నిర్వహించడమే కాకుండా తన భర్తతో సహా అనేక మందిని హత్య చేసిందనే సమాచారం మంగళవారం రాత్రి పోలీసులకు అందింది. దీనిపై ఆమెను విచారించగా.. 13 ఏళ్ల క్రితం తన భర్త సహదేవ్ (30)ను హత్యచేసినట్టు అంగీకరించింది. అంతేకాకుండా తన ఇంట్లోని బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్లో అతడిని పూడ్చిపెట్టినట్టు చెప్పింది.