మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. పదేళ్ల కాలం పాటూ ఇటు పోలీసులను, అటు ప్రజలను నిద్రపట్టనీయకుండా చేసిన ముఠా పట్టుబడింది. అదుపులోకి తీసుకున్న ముగ్గురు సభ్యుల నుంచి వారి నుంచి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ విశాఖ పోలీసులకు చిక్కింది. ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరంతా గుజరాత్లోని దాహూద్ జిల్లా నుంచి వచ్చారని 2010 నుంచి మూడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు వివరించారు. అపార్ట్మెంట్లలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతారని తెలిపారు. తమనెవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకే వారు బట్టలు తీసేసి చోరీలకు పాల్పడుతున్నారని అందుకే వారికి ఆ పేరు వచ్చిందని.. నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.
పట్టుబడ్డవారు తిరుపతి, నెల్లూరు, విశాఖలో సుమారు 20 దొంగతనాలకు పాల్పడ్డారని వారి నుంచి 400 గ్రాముల వెండి వస్తువులు, ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. చెడ్డీ గ్యాంగ్ను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వారిని కమిషనర్ అభినందించారు.