ప్రేమ వ్యవహారంలో పోలీసుల పంచాయితీ ఆపై యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ఆగ్రహించిన గ్రామస్థులు ఠాణాపై దాడి చేశారు. శుక్రవారం రాత్రి అనంతపురం జిల్లా తాడిమర్రి పోలీసుస్టేషన్పై మోదుగులకుంట గ్రామానికి చెందిన వందల మంది దాడి చేయడంతో పోలీసులు భయంతో స్టేషన్ లోపలకు వెళ్లి తలుపులు బిగించుకున్నారు. ఎస్సైపై దాడి చేయడం, పోలీసు జీపు అద్దాలు పగలగొట్టడంతో పాటు స్టేషన్లోని సామగ్రి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి వరకూ ఈ ఆందోళన కొనసాగింది.
తాడిమర్రి మండలం మోదుగులకుంటకి చెందిన లక్ష్మి ... అదే మండలం చిల్లకొండాయపల్లికి చెందిన వినోద్ ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని నిర్ణయించుకున్న వీరు ఐదురోజుల కిందట పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె కనిపించడం లేదని లక్ష్మి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై వేణుగోపాల్ శుక్రవారం ఉదయం ప్రేమ జంటను పోలీసుస్టేషన్కు పిలిపించారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల వెంట మోదుగులకుంటకు వెళ్లిన లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పురుగులమందు తాగి లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి సుధాకర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సమాచారం తెలియడంతో చిల్లకొండాయపల్లికి చెందిన వినోద్ కుటుంబసభ్యులు, గ్రామస్థులు తాడిమర్రి పోలీసుస్టేషన్కు తరలివచ్చారు. ఎస్ఐ తీరుతోనే లక్ష్మి మృతి చెందిందని ఆమె మృతదేహాన్ని చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై వేణుగోపాల్పై దాడి చేయగా.. ఆయన వారి నుంచి తప్పించుకొని లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నారు. మృతదేహాన్ని చూపించే వరకు కదలమని గ్రామస్థులు ధర్నాకు దిగారు.