2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించిన వీడియో బయటికొచ్చింది. తీవ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపుతూ 2016 సెప్టెంబర్లో చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఉడీ ఘటనకు ప్రతీకారంగా పీవోకే లక్ష్యంగా భారత ఆర్మీ ఈ దాడులు నిర్వహించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు దాదాపు ఏడాదిన్నర తర్వాత బయటికి వచ్చాయి. నాలుగు ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ఏవిధంగా భూస్థాపితం చేసిందో ఈ వీడియోలో క్లియర్గా కనబడుతోంది.
ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన మెరుపు దాడులకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత అవి ఎలా జరిగాయో తెలుసుకోవడానికే సైనికులు ఈఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు 5గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో ఏడు ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 38మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలు నిజమైనవేనని ఆనాడు సర్జికల్ స్ట్రైక్స్కు ఇన్ఛార్జ్గా ఉన్న రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా తెలిపారు.