వంగవీటి రాధా తన బలం చూపించబోతున్నారా..? తన వెనుకున్నదెవరో చూపించే ప్రయత్నం చేస్తున్నారా..? సొంత పార్టీలోని అగ్ర నేతలతో పాటు.. పక్కపార్టీలకు తానేంటో చూపించాలనుకుంటున్నారా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. నేడు వంగవీటి రంగా వర్ధంతి నేపద్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బారీ ఏర్పాట్లు చేశారు. అయితే నిజంగా వర్ధంతి కోసమేనా లేక తన బలం ప్రదర్శించడానికేనా.
వంగవీటి రంగా 30 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు బారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాదా రంగా మిత్ర మండలి అద్వర్యంలో పెద్దెత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం రంగా స్వస్థలం కృష్టా జిల్లా కాటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు. వంగవీటి రంగా వర్దంతి యేటా విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సారి భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కాటూరు గ్రామంలో మూడెకరాల విస్తీర్ణంలో వంగవీటి రంగా స్మారక భూమికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో రంగా అభిమానులకు ఆహ్వానాలు పంపించారు.
అయితే ఈ కార్యక్రమానికి ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వైసీపిలో ఉన్న రాధా విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో పార్టీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆయన్ని తూర్పు నియోజకర్గానికి వెళ్లమని సూచించినా ఆయన ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఎంత మంది వచ్చి నచ్చజెప్పినా రాధా మాత్రం వినలేదని చెబుతున్నారు. అయితే సెంట్రల్ విషయంలో తనకు అవమానం జరిగిందని బావిస్తున్న రాధా తన బలం చూపించేందుకు రంగా వర్ధంతిని వేదికగా మార్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
గత రెండు నెలల నుండి సైలెంట్ గా ఉన్న రాధా ఈ కార్యక్రమంలో తన కార్యచరణ ఏదైనా ప్రకటిస్తారా..? తన సత్తా చాటి.. బెజవాడ సెంట్రల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటిస్తారా..? తన బలం.. బలగం చూపించి ప్రధాన పార్టీలకు షాక్ ఇవ్వబోతున్నారా..? అన్నది ఉత్కంఠగా మారింది.