హుస్సేన్ సాగర్లో ఇనుము దొంగలు... ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే ఐరన్పై కాలేసినట్లే. దొరికింది దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు సైతం లైట్ తీసుకోవడంతో లక్షల విలువైన సంపద కాస్త దొంగలపాలవుతోంది. నగరంలోని మాయగాళ్ల కళ్లు హుస్సేన్ సాగర్పై పడ్డాయి. గల్లీ గల్లీలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న పార్వతి తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఇంతవరకు బాగానే ఉన్నా వేలాదిగా తరలివచ్చిన గణనాధులను తొలగించడం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకి పెద్ద సవాల్గా మారితే కేటుగాళ్లు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
హుస్సేన్ సాగర్లో నిమజ్జనం తర్వాత గణేష్ విగ్రహాల స్క్రాప్ను పెద్ద ఎత్తున దోచుకుపోతున్నారు. మార్కెట్లో ఐరన్కు బాగా డిమాండ్ ఉండటంతో దొంగలు ఈజీగా విగ్రహాల తయారీకి ఉపయోగించిన ఇనుమును ఎత్తుకెళ్తున్నారు. పైగా ఈసారి నిమజ్జన టైంలో దాదాపు 200 టన్నులకు పైగా స్క్రాప్ వచ్చినట్లు అధికారులు తేల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా దోచేయాలని చూస్తున్నారు.
సాగర్లో నిమజ్జనం తర్వాత వెలికితీసిన స్క్రాప్ను ఓ మూలన పడేస్తున్నారు. అయితే దీనిని విక్రయించేందుకు ఎలాంటి టెండర్లు పిలవకపోవడంతో దీనిపై కొందరు దొంగలు కన్నేశారు. ఒక్క ఖైరతాబాద్ గణేష్ విగ్రహంలోనే 20 టన్నుల ఐరన్ ఉంటుందని అంచనా. దీని విలువ దాదాపు 8 లక్షల పై మాటే. అలా వేలలో నిమజ్జనం అయిన విగ్రహాల్లో దాదాపు లక్షల్లో ఆదాయం ఉండటంతో కూలీలు, క్రేన్ నిర్వహాకులతో పాటు దొంగలు ఐరన్ను మాయం చేస్తున్నారు.
సాగర్లో గణనాధుల విగ్రహాల నిమజ్జనం ద్వారా వచ్చిన సుమారు 200 టన్నుల స్క్రాప్ను విక్రయించడం వల్ల హెచ్ఎండీఏకు సుమారు 60 లక్షల ఆదాయం వచ్చేది. కానీ కొన్నేళ్లుగా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంతో పక్కదారి పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏటా సాగర్లో క్లీనింగ్ కోసం అధికారులు దాదాపు 26.50 లక్షలు ఖర్చులు చేస్తున్న అధికారులు నిమర్జన స్క్రాప్ను వేలం వేస్తే కనీసం క్లీనింగ్ చేసే ఖర్చు రావడంతో పాటు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.