తెలంగాణ బీజేపీ రెండో జాబితా రెడీ అయ్యింది. 25 మంది అభ్యర్థుల పేర్లతో రూపొందిన లిస్టును అధిష్టానం ఆమోదం కోసం టీబీజేపీ నేతలు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ పడితే ఈ సాయంత్రమే అదృష్టవంతుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండో జాబితా రెడీ అయ్యిందన్న వార్తలతో హైదరాబాద్ కమలంలో కల్లోలం మొదలైంది.
28 మంది పేర్లతో ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన తెలంగాణ బీజేపీ..రెండో లిస్టును కూడా సిద్ధం చేసింది. మొత్తం పాతిక మందితో రెండో జాబితాను రూపొందించారు. 25 మంది లిస్టుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రెండో జాబితాను లక్ష్మణ్.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ ముందు ఉంచుతారు. ఇవాళ జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశం రెండో జాబితాకు ఆమోద ముద్ర వేసిన వెంటనే పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రెండో లిస్టులో ముఖ్యంగా హైదరాబాద్లోని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లే ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణ బీజేపీ ఖరారు చేసిన పేర్లతో చాంద్రాయణగుట్ట- షెహజాది, చార్మినార్- ఉమా మహేందర్ , బహదూర్పుర- హనీఫ్ అలీ, మలక్పేట్- ఆలె జితేంద్ర, యాకత్పుర- రూప్రాజ్, కూకట్పల్లి- మాధవరం కాంతారావు, రాజేంద్రనగర్- బద్దం బాల్రెడ్డి, ఇబ్రహీపట్నం- కొత్త అశోక్ గౌడ్, శేరి లింగంపల్లి- యోగానంద్ ఉన్నారు. అలాగే నిజామాబాద్ యెండల లక్ష్మీనారాయణ, కొడంగల్ - నాగూరావు నమోజీ, ఆలేరు- శ్రీధర్రెడ్డి, మహబూబ్నగర్- పద్మజా రెడ్డి, దేవరకద్ర- ఎగ్గెని నర్సింహులు, రామగుండం- బలమూరి వనిత, కొత్తగూడెం- కుంచె రంగాకిరణ్ పేర్లు ఖరారయ్యాయి.
రెండో లిస్టులో అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లు తెలియడంతో టికెట్ ఆశిస్తున్న నేతల అనుచరులు ఆందోళనలకు దిగారు. మలక్పేట టికెట్ ఆశిస్తున్న సురేందర్ రెడ్డి..ఇంటి దగ్గర బీజేవైఎం నేత ఒకరు ఒంటిపై కిరోసిన్ చల్లుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. మలక్పేట టికెట్ ఆశిస్తున్న సురేందర్ రెడ్డితో పాటు శేరిలింగంపల్లి టికెట్ ఆశిస్తున్న నరేష్ కూడా ఇవాళ హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.