రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్

Update: 2018-12-16 14:58 GMT

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేసీఆర్. ఆదివారం పలు కీలక ఫైళ్లు చూసిన ఆయన ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో  నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తానని ఎన్నికల సందర్బంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం  ఈ రెండింటిని జిల్లాలుగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణలోని పది జిల్లాలను.. 31 జిల్లాలుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని జిల్లాల సంఖ్య మొత్తం 33కు చేరుతుంది. ఇదిఅలావుంటే రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు,  ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ నియామక ఉత్తర్వులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  కాగా ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి లు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. 

Similar News