జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గుంటూరు లో పార్టీ ఆవిర్భావ సభ నుంచి ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ మీడియాతో మాట్లాడిన పవన్ ..ఏపీ ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టారు. టీడీపీ నేతల అవినీతి, పోలవరం నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని సూచించారు.
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీటీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. డిప్యూటీసీఎం కేఈ కృష్ణ మూర్తి మాట్లాడుతూ
పవన్ వ్యాఖ్యలతో పోయింది ఆయన పరువే... పోలవరంలో జరిగిన అవినీతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపై చర్యలు తీసుకునే ధైర్యమున్న ప్రభుత్వం తమదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైనా పవన్ మాట మారుస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడతానన్నారని, దీనిపై ఢిల్లీలో చర్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ ఆలోచన చేస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు.అధికారంలో లేని వాళ్ల సలహాలు తీసుకుంటే పవన్ కళ్యాణే నష్టపోతారన్నారు. మూడు నెలలకోసారి వచ్చి బురద జల్లుడు కార్యక్రమాలు చేయడం సరికాదని హితవు పలికారు.
నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు ఆస్కారమే లేదని, రెండ్రోజుల కిందట ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 16 సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్క పోలవరమే... భూ సేకరణకు సంబంధించి నాబార్డు నుంచి నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో నష్టపరిహారం జమవుతోందని మంత్రి దేవినేని తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాని మోడీకి జగన్, పవన్ లు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివారని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
మంత్రి నారాయణ మంత్రి నారాయణ కూడా సోమవారం మాట్లాడుతూ జనసేనానిపై విమర్శలు కురిపించారు. పవన్ కల్యాణ్ రోజుకో ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆయనతో నాటకమాడిస్తోందని నారాయణ మండిపడ్డారు.