ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా తమిళనాడులోని కొందరు పర్యావరణ ప్రేమికులు వినూత్న నిరసన చేపట్టారు. వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని, భూగర్భ జలాలకు సమస్యాత్మకంగా మారుతున్నాయని పేర్కొంటూ ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించారు. తలలపై పోలిథిన్ బ్యాగ్లను ధరించి రోడ్లపైకి వచ్చారు. మరోవైపు పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్ విషయంలో తమిళనాడు సర్కారు కఠిన చర్యలకు దిగింది. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. 2019 జనవరి 1 నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
పాలు, ఆయిల్ పౌచ్లు, మెడికల్ యుటిలిటీస్, ఇతర ప్రాథమిక ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. రూల్ 110 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుజరాత్ కూడా ప్రజా రవాణా మార్గాలు, గార్డెన్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నేటి నుంచి నిషేధిస్తున్నట్టు పేర్కొంది.