నిన్నమొన్నటి వరకు మహా కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. నామినేషన్ల గడువు ముగియడంతో పార్టీ రెబల్స్ బెడద ఆందోళన కల్గిస్తోంది. టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు తిరుబాటు అభ్యర్దులుగా రంగంలోకి దిగడంతో వాళ్లందరినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎదుర్కోనేందుకు కలిసి వచ్చిన పార్టీలతో కాంగ్రెస్ జతకట్టింది. టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐతో ప్రజా కూటమి ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ ల మధ్య ఏకాభిప్రాయం కుదిరినా టీజేఎస్ తో పేచీ తప్పలేదు. జనసమితికి కేటాయించిన సీట్లలో ఏడు స్థానాల్లో కాంగ్రెస్ బీ ఫాంలు ఇచ్చి స్నేహ పూర్వక పోటీకి తెరలేపింది.
కూటమితో సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్ లో టిక్కెట్టు రాని నేతలంతా పార్టీకి రెబల్స్ గా రంగంలో దిగారు. స్వతంత్ర అభ్యర్దులుగా నామినేషన్లు వేసి పార్టీకి సవాలు విసురుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద పార్టీకి దడ పుట్టిస్తుంది. దీంతో పార్టీ బుజ్జగింపులు కమిటీ రంగంలో దిగినా పరిస్థితి చల్లబడేలా కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ రెబల్స్ ఏ స్థాయిలో ఉన్నారో లెక్కలు వేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా రెబల్స్ బెడద హస్తం పార్టీకి బాగానే కనిపిస్తోంది.
సికింద్రాబాద్ లో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి, ఖైరతాబాద్ నుంచి డాక్టర్ రోహిన్ రెడ్డి, మేడ్చల్ లో టిక్కిట్టు ఆశించి భంగపడ్డ తోటకూర జంగయ్యయాదవ్, స్టేషన్ ఘన్ పూర్ లో మాజీ మంత్రి విజయరామారావు, నారాయణ పేట్ లో శివకుమార్ రెడ్డి, చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్, సూర్యాపేట్ లో పటేల్ రమేష్ రెడ్డి, పరకాలలో వెంకట రమణారెడ్డి, మహబూబాబాద్ లో దస్రూ నాయక్, డోర్నకల్ నెహ్రూనాయక్, ధర్మపురి డాక్టర్ రవీందర్, పెద్దపల్లిలో చేతి ధర్మయ్య, ఎల్లారెడ్డి శుభాష్ రెడ్డి, దేవరకద్ర ప్రదీప్ కుమార్ గౌడ్, ముదోల్ నారాయణరావు పటేల్, బోథ్ అనిల్ జాదవ్ తిరుగుబాటు అభ్యర్దులుగా నామినేషన్లు వేశారు. ఇంకా చాలా నియోజక వర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ ను నిలువరించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కు రెబల్స్ బెడద గుబులు రేపుతుంది. పార్టీ నేతలు బలంగా ఉండడంతో బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరించడం పార్టీకి సవాలుగా మారే ప్రమాదముంది. రెబల్స్ ప్రమాదం నుంచి పార్టీ ఏవిధంగా బయటపడుతుందో చూడాలి.