ఆధార్తో మొబైల్ నంబర్ను అనుసంధానం చేయడానికి వచ్చే ఫిబ్రవరిని డెడ్లైన్గా విధించిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఆధార్ను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. డిజిటల్ హర్యానా సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి గడ్కరీతో ఆధార్- డ్రైవింగ్ లైసెన్స్ అనుసంధానం గురించి మాట్లాడటం జరిగిందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అయితే ఎప్పటి నుంచి ఈ అనుసంధాన ప్రక్రియ మొదలవుతుందో.. ఎప్పటికి పూర్తవుతుందో తేదీలను మాత్రం మంత్రి ప్రకటించలేదు. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. నవంబర్ నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆధార్ను పలు కార్డులకు అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే.