తెలంగాణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మొత్తం 32 వేల 815 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చని ఇప్పటికే 100 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ జరుగుతుందని మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని.. రజత్కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు.