న్యాయం కోసం 51రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టిన సంగీత ఆమరణదీక్ష మొదలుపెట్టింది. తనకూ, తన కూతురుకు న్యాయం జరిగే వరకూ ఆమరణదీక్ష విరమించేది లేదని చెబుతోంది. ఆమరణదీక్షకు దిగిన సంగీతకు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సంగీతకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు.
అదనపు వరకట్న వేధింపులకు తోడు ఆడబిడ్డ పుట్టిందనే నెపంతో భర్త శ్రీనివాస్రెడ్డి చిత్రహింసలకు గురిచేస్తూ సంగీతను ఇంటి నుంచి గెంటేశాడు. దీనికి తోడు భార్య సంగీతకు తెలియకుండానే మరో యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. దాంతో గతేడాది నవంబర్ 20న హైదరాబాద్ బోడుప్పల్ సరస్వతికాలనీలోని భర్త ఇంటి వద్ద సంగీత నిరసన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా సంగీతకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, గ్రామ పెద్దలు జరిపిన రాజీ బేరాలు సఫలం కాకపోవడంతో విసిగిపోయిన సంగీత ఆమరణదీక్షకు దిగింది.