నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసోంది. 12 లక్షల మంది నిరుద్యోగులకు అక్టోబర్ 2 నుండి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే భృతిని జమ చేయడానికి కసరత్తు చేస్తోంది, నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేస్తుకోవడానికి ఈ నెల 14న వెబ్ సైట్ అందుబాటులోకి తెస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికల్లో ఒకటైన నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. నిరుద్యోగ భృతి పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తంగా పేరు పెట్టిన ప్రభుత్వం ఇందుకోసం 1500 కోట్లు కేటాయించింది. అభ్యర్థులు పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ లైన్ లోనే అప్లయ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నెల 14న చంద్రబాబు యువనేస్తం వెబ్ సైట్ ప్రారంభిస్తారు. రెండు వారాల పాటు అన్ లైన్ లో అప్లయ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. యువనేస్తం పథకం అమలు పనులను ఐటీ మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధపెట్టి పర్యవేక్షిస్తున్నారు.
నిరుద్యోగ భృతి పొందేందుకు 22 నుంచి 35 సంవత్సరాల వయస్సు కల వారు అర్హులు. డిగ్రీ, పీజి, డిప్లమో చేసి ఏడాది అయిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. నిరుద్యోగ భృతిని దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు ఉండి, ప్రజాసాధికార సర్వేలో లబ్దిదారుని పేరు నమోదయ్యి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకుని ఉండాలి. ఒకవేళ అలా అనుసంధానం కాకపోతే వెంటనే చేసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు సామాజిక పెన్షన్లు పొందుతున్నా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈపీఎఫ్, ఈఎస్ఇలు ఉన్న ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
నిరుద్యోగ భృతి ఇవ్వడమేకాదు లబ్దిదారులకు ఇష్టమైన మూడు రంగాల్లో శిక్షణను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. దీంతో నిరుద్యోగులు తమ కాళ్ళ తాము నిలబడేలా ప్రోత్సాహం లభించినట్లవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని యువనేస్తంకు అనుసంధానం చెయ్యడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయించింది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తం లో భాగస్వామ్యం చేయబోతున్నారు. వీటి వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగ భృతికి సంబంధించి సంబంధించిన ఇబ్బందుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.